Tamilnadu: ప్రేమలో పడిందని... కుమార్తె పాలిట కసాయిగా మారిన తండ్రి!

  • తమిళనాడులోని మధురై ప్రాంతంలో ఘటన
  • కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని పెద్దలు
  • గర్భంతో ఉన్న కుమార్తెపై కత్తితో తండ్రి దాడి

ప్రేమలో పడిన కుమార్తె, తన మాటను కాదని వేరే పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో ఓ తండ్రి కసాయిగా మారాడు. కన్నబిడ్డను హత్యచేసేందుకు చూసి, ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. తమిళనాడు, మధురై ప్రాంతంలో జరిగిన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, ఇక్కడి నాగయ్యపురానికి చెందిన వాల గురునాథన్‌ (55) ఎరువుల వ్యాపారి. ఇతని కుమార్తె సుష్మ (19) బీఎస్సీ మొదటి సంవత్సరం చదువును నిలిపివేసి ఇంట్లోనే ఉంటోంది. పక్క ఊరికి చెందిన శివశంకరన్‌ (23) అనే యువకుడితో పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఆమె ప్రేమలో పడింది. అయితే, ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో తల్లిదండ్రులు వ్యతిరేకించారు.

పెద్దలను ఎదిరించాలని నిర్ణయించుకున్న శివశంకరన్, సుష్మ రెండు నెలల క్రితం వివాహం చేసుకుని, భద్రత కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రెండు కుటుంబాలకూ కౌన్సెలింగ్ ఇచ్చారు. శివశంకరన్ ను తమ అల్లుడిగా అంగీకరించేది లేదని సుష్మ తల్లిదండ్రులు తెగేసి చెప్పారు.

పోలీసుల చొరవతో కొత్తదంపతులు వాళవందాన్‌ పురంలో కాపురం పెట్టారు. ఈ నేపథ్యంలో గర్భిణి అయిన సుష్మ, భర్తతో కలిసి, ఆరోగ్య కేంద్రానికి పరీక్షల నిమిత్తం వెళ్లగా, అక్కడికి వచ్చిన సుష్మ తండ్రి, ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ, కత్తితో దాడి చేశాడు. ఆ వెంటనే శివశంకరన్‌ పరుగున వచ్చి, భార్యను పక్కకు లాగేసి, ఆమెను కాపాడాడు. సుష్మకు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం తిరుమంగళం ఆసుపత్రికి పంపగా, పోలీసులు వాలగురునాథన్‌ను అరెస్టు చేశారు.

More Telugu News