West Bengal: ఆమెలా మారిన అతడు, అతనిలా మారిన ఆమె... కుతూహలం రేపిన ఆ ఇద్దరి పెళ్లి!

  • సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీలు చేయించుకున్న ఇద్దరు
  • బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి
  • సహకరించిన తొలి ట్రాన్స్ జెండర్ ప్రిన్సిపాల్ మనాబి

కోల్ కతాలో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. ఎందుకంటే, వరుడు గతంలో అమ్మాయి కాగా, వధువు గతంలో అబ్బాయి కావడమే. వివరాల్లోకి వెళితే, ఉత్తర కోల్ కతా శివార్లలో మహజాతి నగర్ లో సుశాంతో అనే అబ్బాయి, పేరుకు మాత్రమే బాలుడైనా, అతని ఆలోచనలన్నీ అమ్మాయిగానే ఉండేవి. చిన్నతనంలోనే తనలోని మార్పును గమనించిన సుశాంతో, లింగమార్పిడి చేయించుకుని, తీస్తా దాస్ గా మారాడు. ఆపై బెంగాల్ లో తొలి ట్రాన్స్ జెండర్ ప్రిన్సిపాల్ మనాబి బందోపాధ్యాయ్ ప్రోత్సాహంతో సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ చేయించుకున్నాడు. ఆపై స్త్రీగా మారిపోయాడు. ఈ ఆపరేషన్ కోసం చేసిన అప్పు తీర్చలేకపోయిన తీస్తా దాస్ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆపై తీస్తా దాస్ పేరు అందరికీ తెలియగా, ఆమెపై ఓ డాక్యుమెంటరీ కూడా తయారైంది. సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ చేయించుకున్న ట్రాన్స్ జెండర్ల పరిస్థితిపై నిర్మితమైన సినిమాలోనూ ఆమె నటించింది. ఆపై అసోంకు చెందిన అమ్మాయి, ఇదే తరహా ఆపరేషన్ చేయించుకుని చక్రవర్తిగా మారి, తీస్తాకు పరిచయం అయ్యాడు. వీరిద్దరూ ప్రేమలో పడి, పెళ్లాడాలనుకుంటున్నామని, ఏప్రిల్ 15న తమ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్రాన్స్ మ్యాన్ ను ఎందుకు చేసుకోవాలని ప్రశ్నించిన వారు కొందరున్నా, తీస్తా వాటిని పట్టించుకోలేదు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

More Telugu News