Andhra Pradesh: మంత్రిగారూ.. ఒక్కసారి జగన్ నేరచరిత్రను చదువుకోండి!: నారా లోకేశ్

  • రిలయన్స్ పేరిట టీడీపీ నకిలీ కంపెనీ సృష్టించిందన్న మంత్రి
  • ఖండించిన టీడీపీ నేత నారా లోకేశ్
  • మంత్రి గౌతమ్ రెడ్డి, జగన్ లపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డిలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రిలయన్స్ పేరుతో ఓ నకిలీ కంపెనీని సృష్టించి 1000 ఎకరాలు కొట్టేసేందుకు తాము ప్రయత్నించినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. నిజంగా ఇది ఫేక్ కంపెనీ అయితే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లు ఎందుకు విడుదల చేస్తుందని ప్రశ్నించారు. ఇది కూడా తెలియని వ్యక్తులు అక్రమాలపై విచారణ చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

నిజంగా ఫేక్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే జగన్ నేర చరిత్రను ఓసారి చదువుకోవాలని లోకేశ్ గౌతమ్ రెడ్డికి సూచించారు. వైసీపీలో 'యథా రాజా తథా మంత్రి' అన్న రీతిలో నోటికొచ్చినట్లు అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేసేముందు 1-2 నిమిషాలు బుర్ర వాడి ఉంటే ఈ సమాచారమంతా ఇంటర్నెట్ లో దొరికేదని చురకలు అంటించారు.

రిలయన్స్ ప్రోలిఫిక్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన సంస్థని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్ కంపెనీ ఆర్థిక స్టేట్ మెంట్లను తన హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.

More Telugu News