Kaleswaram project: అప్పటి వరకూ రైతులకు ప్రభుత్వ సాయం అందజేస్తాం: సీఎం కేసీఆర్

  • గతంలో తెలంగాణలో అప్పులేనటువంటి రైతు లేడు
  • ఆ అప్పులు తీరిపోవాలి.. మిగులు సాధించాలన్నదే లక్ష్యం
  • ‘కాళేశ్వరం’ ద్వారా అదనంగా 400 టీఎంసీలు లభిస్తాయి

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోను సీఎం కేసీఆర్ ఈ రోజు పర్యటించారు. మేడిగడ్డ, ఎల్లంపల్లి బ్యారేజ్ ని పరిశీలించారు. సొరంగాలలో నీటి తరలింపుపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత, ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ,
గతంలో తెలంగాణలో అప్పులేనటువంటి రైతు లేడని, వారి అప్పులు తీరిపోయి మిగులు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అప్పటి వరకూ ప్రభుత్వం తరపున సాయం అందజేస్తామని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా 400 టీఎంసీలు లభిస్తాయని, తద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు, 56 లక్షల గృహాలకు తాగునీరు లభిస్తుందని అన్నారు. జూన్-నవంబర్ వరకూ ఎత్తిపోతల ద్వారా నీరు పంపుతామని, ప్రతిరోజూ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లికి మూడు టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ కు రెండు టీఎంసీల నీరు అందుతుందని అన్నారు. రాబోయే రెండేళ్లలో ఎస్సారెస్సీ, నిజాంసాగర్, సింగూర్ ప్రాజెక్టులకు నీరు అందిస్తామని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిర్ణీత సమయంలో పూర్తి కావాలని, తెలంగాణలో విద్యుత్ సమస్య తీరిందని అన్నారు. మిషన్ భగీరథ అద్భుతమైన ఫలితాన్నిచ్చిందని, భవిష్యత్ కోసం శాశ్వత మంచినీటి వనరులను సమకూర్చుకున్నామని, పేద, ధనిక తేడా లేకుండా అందరికీ రక్షిత మంచినీరు అందిస్తున్నామని చెప్పారు.

More Telugu News