Prabhas: 'సాహో'కు దారిచ్చిన చిత్రబృందాలకు కృతజ్ఞతలు: ప్రభాస్

  • ఆగస్టు 30న విడుదల కానున్న సాహో
  • సాహో కోసం బరి నుంచి తప్పుకున్న నాలుగు చిత్రాలు
  • సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్టు

తెలుగు వెండితెరపై వస్తున్న మరో అతి భారీ చిత్రం సాహో. ప్రభాస్ కథానాయకుడిగా యువ దర్శకుడు సుజిత్ రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా విడుదల నేపథ్యంలో నాలుగు చిత్రాల విడుదల వాయిదా పడింది. సాహో మరిన్ని స్క్రీన్లలో ప్రదర్శితమయ్యేందుకు వీలుగా నిర్మాతల మధ్య రాజీ కుదిరింది. అందుకే పలు చిత్రబృందాలు సాహో విడుదల సందర్భంగా తమ చిత్రాలను రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నాయి. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

"ఆగస్టు 30న సాహో విడుదలకు మార్గం సుగమం చేసిన నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు ఉంటాయి, ఆల్ ది బెస్ట్" అంటూ విషెస్ చెప్పారు. ఇదే విధంగా సాహో చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపింది. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించిన సాహో చిత్రానికి సరిపడినన్ని స్క్రీన్లు అందించడం ద్వారా ఫిలిం ఇండస్ట్రీ తమకు అండగా నిలిచిందని యూవీ క్రియేషన్స్ తన పోస్టులో పేర్కొంది.

More Telugu News