Chandrababu: వైఎస్ జగన్ ను నిలదీస్తున్న ఏఎన్ఎం... వీడియోను పోస్ట్ చేసిన చంద్రబాబు!

  • ఇటీవల విజయవాడలో ఏఎన్ఎంల ధర్నా
  • జగన్ పై మండిపడ్డ ఓ మహిళ
  • వైసీపీ దుర్మార్గానికి ఇదే పరాకాష్ఠ 
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన చంద్రబాబు

తమ సమస్యలను పరిష్కరించాలని, పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఇటీవల ఏఎన్ఎంలు విజయవాడలో ధర్నాకు దిగిన సమయంలో తీసిన వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఓ ఏఎన్ఎం, తన భర్తతో పాటు ఎంతో మంది మొగుళ్లను జైళ్లలో పెట్టారని, ధర్నాను విరమించి తాము వెనక్కు వెళితేనే వారిని వదిలేస్తామని అంటున్నారని మండిపడింది. వేల కిలోమీటర్లు పాదయాత్ర తిరిగిన జగన్, పక్కనే ఉన్న విజయవాడకు వచ్చి తమతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. తాము ఎంతో మందికి చెప్పి జగన్ కు ఓటేయించామని, ఇప్పుడు ఆయన వచ్చి తమ సమస్యలు తీర్చాల్సిందేనని డిమాండ్ చేసింది.

ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన చంద్రబాబు, "వైసీపీ ప్రభుత్వ దుర్మార్గానికిది పరాకాష్ట. తమ సమస్య చెప్పుకోడానికని వచ్చిన ఎఎన్ఎమ్ లను ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. గత్యంతరంలేక ఆందోళనకు దిగిన మహిళలను బెదిరించడానికి వారి భర్తలను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారా? న్యాయం చేయడం చేతకాక మహిళల పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తారా?" అని ప్రశ్నించారు. ఆ వీడియోను మీరూ చూడండి.

More Telugu News