Zomato: ఆర్డర్ డెలివరీ కోసం ఎదురుచూస్తుంటే... జొమాటో బాయ్ ఫోన్ తస్కరణ!

  • హైదరాబాద్, పంజాగుట్టలో ఘటన
  • ఆర్డర్ కోసం వేచి చూస్తున్న బాయ్
  • ఫోన్ లాక్కెళ్లిన ఆగంతకులు

ఆన్ లైన్ లో తనకు వచ్చిన ఆర్డర్ ను డెలివరీ చేసేందుకు వేచిచూస్తున్న ఓ యువకుడి నుంచి స్మార్ట్ ఫోన్ ను దొంగిలించారు. ఈ ఘటన హైదరాబాద్ లోని పంజాగుట్టలో జరిగింది. పంజాగుట్ట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడి బీకేగూడ ప్రాంతానికి చెందిన సతీశ్ కుమార్, జొమాటో తరఫున ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ ఆర్డర్ రాగా, పంజాగుట్ట క్రాస్ రోడ్స్ లో ఉన్న వై2కే రెస్టారెంట్ వద్దకు వచ్చాడు. అక్కడ ఫుడ్ ఆర్డర్ ను పరిశీలిస్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు, అతని చేతిలో ఉన్న ఫోన్ ను బలవంతంగా లాగేసుకుని వెళ్లిపోయారు. బాధితుడు పక్కనే ఉన్న స్టేషన్ కు వెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

More Telugu News