BJP: మాట నిలబెట్టుకున్నారంటూ మోదీకి చెందిన అరుదైన ఫొటోను పోస్టు చేసిన రామ్ మాధవ్

  • ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ స్పందన
  • అప్పట్లో ఆర్టికల్ 370 రద్దు కోసం మోదీ ధర్నా చేసినప్పటి ఫొటో పెట్టిన రామ్ మాధవ్
  • ఏడు దశాబ్దాల డిమాండ్ కళ్ల ముందే నెరవేరిందంటూ ఆనందం

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేసిన కొద్దిసేపటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "మాట నిలబెట్టుకున్నారు" అనే శీర్షికతో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రామ్ మాధవ్ తన ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ పాత ఫొటోను జతచేశారు. ఆ ఫొటోలో మోదీ ఓ ధర్నా కార్యక్రమంలో కూర్చుని ఉన్నారు.

ఆయన వెనుక ఉన్న బ్యానర్ పైన "ఆర్టికల్ 370ని తొలగించండి, ఉగ్రవాదానికి చరమగీతం పాడండి" అంటూ నినాదాలు ఉన్నాయి. దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన రామ్ మాధవ్, మోదీ అప్పట్లోనే ఆర్టికల్ 370 రద్దుపై ఎలుగెత్తారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకున్నారనే అర్థం వచ్చేలా తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇది నిజంగా దివ్యమైన రోజని, ఏడు దశాబ్దాల నాటి పరిపూర్ణ భారతదేశం డిమాండ్ నేడు మన కళ్లముందే నెరవేరిందని హర్షం వెలిబుచ్చారు.

More Telugu News