CM Ramesh: రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు బాధగానే ఉంటుంది.. ఆ తర్వాత అంతా సంతోషమే: సీఎం రమేశ్

  • ఆర్టికల్ 370ని రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయం
  • విభజన తర్వాత ఏపీ, తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయి
  • జమ్ముకశ్మీర్ విభజన వల్ల అంతా మంచే జరుగుతుంది

ఆర్టికల్ 370ని రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కొనియాడారు. జమ్ముకశ్మీర్ ను రెండు ముక్కలుగా చేయడాన్ని కూడా ఆయన స్వాగతించారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో బాధగానే ఉంటుందని... ఆ తర్వాత దాని ఫలితాలు సంతోషాన్ని కలిగిస్తాయని చెప్పారు. ఇదే సభలో తాను రాష్ట్రాలను విభజించే ఘటనలను రెండు చూశానని తెలిపారు. ఏపీ, తెలంగాణ రెండుగా విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేసేటప్పుడు లోక్ సభ తలుపులు వేసేశారని, ఏపీకి చెందిన ఎంపీలందరినీ సభ నుంచి బయటకు పంపించి వేశారని, సమావేశాల ప్రసారాలను కూడా కట్ చేశారని సీఎం రమేశ్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు జమ్ముకశ్మీర్ ను విభజిస్తున్న సమయంలో సభా సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల నష్టమేమీ లేదని... కొన్ని రోజుల తర్వాత అందరూ సంతోషంగా ఉంటారని అన్నారు.

More Telugu News