Jammu And Kashmir: రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్!

  • ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నాం
  • ఎన్నో పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి
  • ప్రజాస్వామ్యానికి ఇది చీకటిరోజని వ్యాఖ్య

పార్లమెంట్ సాక్షిగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పి, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్ లోని పీడీపీ సహా కాంగ్రెస్ తో పాటు ఎన్నో పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కేంద్రం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని అన్నారు. ఇదే సమయంలో సభలో రాజ్యాంగాన్ని చింపాలని పీడీపీ సభ్యులు ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చొక్కాలు చించుకోవడాన్ని తప్పుబట్టారు. ఆపై కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయగా, రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజనపై చర్చ కొనసాగుతోంది.

More Telugu News