Article 370: ఆర్టికల్ 370 రద్దుతో భారత ఉపఖండం నిప్పుల కుంపటే.. మెహబూబా ముఫ్తీ హెచ్చరిక

  • పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దు తీర్మానం
  • ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా
  • భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటిదినమన్న మాజీ సీఎం

కేంద్రం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A లను రద్దు చేయడంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఈరోజు భారత ప్రజాస్వామ్యంలోనే అత్యంత చీకటి దినమని వ్యాఖ్యానించారు. ‘జమ్మూకశ్మీర్ నాయకత్వం 1947లో రెండు జాతులు-రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించి భారత్ తో చేతులు కలిపింది. కానీ ఆ నిర్ణయం ఈరోజు కశ్మీరీల పాలిట శరాఘాతంగా మారింది.

ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగవిరుద్ధమే. దీనివల్ల భారత్ జమ్మూకశ్మీర్ లో దురాక్రమణదారుగా మారుతుంది. దీనివల్ల భారత ఉపఖండంలో తీవ్రమైన దుష్పరిణామాలు సంభవిస్తాయి.

జమ్మూకశ్మీర్ ప్రజలను భయపెట్టి రాష్ట్ర భూభాగాన్ని లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కశ్మీర్ కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో భారత్ ఘోరంగా విఫలమైంది’ అని ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

More Telugu News