Tirupati: అక్కడ స్వామి భక్తుడిగా, ఇక్కడ స్వామి విధేయుడిగా ఉంటాను: ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్

  • తిరుమల కొండపైనా, కింద రాజకీయాలు చేయను
  • ఎవరేమి మాట్లాడిన పట్టించుకోను
  • అలాగని, వైసీపీ హోర్డ్ కోర్ టెర్రరిస్టు గొంతు మూగబోయిందనుకోవద్దు

తిరుపతిలో ఉంటే స్వామి భక్తుడిగా, అమరావతికి వస్తే స్వామి (జగన్)కి విధేయుడిగా ఉంటానని ఎస్వీబీసీ చైర్మన్, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమల కొండపైన, కొండ కింద రాజకీయాలు చేయనని అన్నారు. ఎవరేమి మాట్లాడిన తాను పట్టించుకోనని, తాను మాత్రం నిబద్ధతతో ఉంటానని అన్నారు.

తిరుమల కొండపై పార్టీ గురించి, జెండా గురించి మాట్లాడననీ, ఓన్లీ అజెండా గురించి మాత్రమే మాట్లాడతానని చెప్పారు. ఎస్వీబీసీలో ఉన్న ఉద్యోగులందరినీ ఓ కుటుంబంలా భావించి, చైర్మన్ సంస్కృతిని మొట్టమొదటిసారిగా తాను మార్చానని చెప్పారు.

ఐడెంటీకార్డు మెడలో వేసుకుని కెమెరామెన్ తో, లైట్ బాయ్ తో ఉంటానని, ఎలా కలిసి మెలిసి మెలగాలో తనకు సినీ ఇండస్ట్రీ నేర్పిందని అన్నారు. తనకు ఎలాంటి ఇగో లేదని, అందుకే, అందరితో దగ్గరగా ఉంటానని చెప్పారు. ఎస్వీబీసీ చైర్మన్ గా పని చేసే బ్రహ్మాండమైన అవకాశాన్ని ఆ స్వామి వారు తనకు కల్పించారని, రాజకీయాల జోలికి పోనని స్పష్టం చేశారు.

అలాగని చెప్పి, వైసీపీ హోర్డ్ కోర్ టెర్రరిస్టు గొంతు మూగబోయిందని ఎప్పుడూ అనుకోవద్దని, అమరావతికి వస్తే జగనన్న పక్కన నిలబడతానని, ‘నా నాయకుడి మీద, నా దేవుడి మీద గాని ఎవరు మాట్లాడినా చీల్చి చెండాటం జరుగుతుంది’ అని హెచ్చరించారు.

More Telugu News