Andhra Pradesh: ఆత్మహత్య చేసుకున్న ‘నారాయణ’ విద్యార్థి.. కాలేజీ వేధింపులే కారణమన్న మృతుల తల్లిదండ్రులు!

  • ఏపీలోని కడప జిల్లాలో ఘటన
  • ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్న హర్షవర్థన్
  • కాలేజీ ఏజీఎం కొట్టాడని తల్లిదండ్రుల ఆరోపణ

ఆంధ్ర ప్రదేశ్ లో మరో విద్యార్థి బలవనర్మణానికి పాల్పడ్డాడు. వైఎస్సార్ కడప జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడప పట్టణానికి చెందిన హర్షవర్థన్ స్థానికంగా ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లిన హర్షవర్థన్ ఎదురుగా వస్తున్న రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే కాలేజీ అధ్యాపకుల వేధింపుల కారణంగానే హర్షవర్థన్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ ఏజీఎం తన కుమారుడిని కొట్టారనీ, లెక్చరర్ల ముందు దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవమానం తట్టుకోలేకపోయిన హర్షవర్థన్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మరోవైపు హర్షవర్థన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి కేసూ నమోదు కాలేదు.

More Telugu News