Kidnap: కిడ్నాపర్ రవిశేఖర్ ను మీడియా ముందు ప్రవేశపెట్టిన రాచకొండ పోలీసులు

  • కారు నంబర్ ఆధారంగా కేసు ఛేదించామన్న పోలీసులు
  • సోనీని రవిశేఖర్ అద్దంకిలో విడిచిపెట్టాడని చెప్పిన సీపీ
  • ఏపీ పోలీసుల సాయంతో రవిశేఖర్ ను పట్టుకున్నామని వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సోనీ అనే యువతి కిడ్నాప్ కేసు సుఖాంతమైన సంగతి తెలిసిందే. కిడ్నాపర్ రవిశేఖర్ ఆ అమ్మాయిని విడిచిపెట్టగా, ఆపై పోలీసులు రవిశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, రాచకొండ పోలీసులు కిడ్నాపర్ రవిశేఖర్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ, కారు నంబర్ ఆధారంగా కేసును ఛేదించామని వెల్లడించారు.  

సోనీని రవిశేఖర్  అద్దంకిలో విడిచిపెట్టాడని, ఏపీ పోలీసుల సాయంతో రవిశేఖర్ ను పట్టుకున్నామని చెప్పారు. అతడి నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రవిశేఖర్ పై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని వివరించారు. అతడిపై ఏపీలోనే 50 కేసులు ఉన్నాయని చెప్పారు.

2001 నుంచి రవిశేఖర్ నేరాల బాట పట్టాడని, ఏడు మారుపేర్లతో తెలుగు రాష్ట్రాల సహా, కర్ణాటకలోనూ మోసాలకు పాల్పడ్డాడని వివరించారు. జల్సాలకు అలవాటు పడి మోసాలు చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. అంగన్ వాడీ మహిళలు, ఇతర యువతులు రవిశేఖర్ చేతిలో మోసపోయారని, రెండు పర్యాయాలు జైలుకు కూడా వెళ్లాడని, ఓసారి కోర్టుకు వస్తూ పారిపోయాడని వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దని ఈ సందర్భంగా సీపీ హితవు పలికారు. ముఖ్యంగా, రవిశేఖర్ లాంటి వాళ్లను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ స్పష్టం చేశారు.

More Telugu News