Virat Kohli: నువ్వా? నేనా? అంటున్న కోహ్లీ, రోహిత్... ఒకే రికార్డు కోసం ఇద్దరూ పోటీ!

  • టి20 క్రికెట్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన కోహ్లీ, రోహిత్
  • ఇద్దరి ఖాతాలో చెరో 20 ఫిఫ్టీలు
  • విండీస్ తో మ్యాచ్ లో ఎవరు ఫిఫ్టీ చేసినా సరికొత్త రికార్డు

వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కొన్నివారాల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా తాజాగా మరో సీజన్ కు శ్రీకారం చుడుతోంది. వెస్టిండీస్ తో నేడు అమెరికాలో టీ20 మ్యాచ్ లో తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓ రికార్డు ముంగిట నిలిచారు. ఈ ఇద్దరు ఉద్ధండులు కూడా అంతర్జాతీయ టి20 క్రికెట్లో చెరో 20 అర్థసెంచరీలతో సమవుజ్జీలుగా ఉన్నారు. వీరిలో ఎవరు అర్ధసెంచరీ సాధించినా అత్యధిక ఫిఫ్టీల రికార్డు తమ పేరిట లిఖించుకుంటారు.

ఇవాళ జరగబోయే మ్యాచ్ లో అందరి కళ్లు వీరిపైనే ఉంటాయనడంలో సందేహంలేదు. ఆటేతర విషయాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నా, ఒకే ప్రపంచరికార్డు కోసం ఇద్దరూ పోటీలో ఉండడం అరుదైన విషయంగా చెప్పాలి. కాగా, కోహ్లీ, రోహిత్ తర్వాత కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 16 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

More Telugu News