Andhra Pradesh: ఇంకోసారి టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేయను.. బుద్ధా వెంకన్న సంచలన ప్రకటన!

  • బాధ్యతలు ఎవరికి ఇచ్చినా సహకరిస్తా
  • విజయవాడలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ భేటీ
  • సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన బుద్ధా వెంకన్న

విజయవాడలో ఈరోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో హాట్ హాట్ గా చర్చ సాగింది. ఈ సమావేశానికి టీడీపీ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డుమ్మా కొట్టారు. మరోవైపు ఈ సమావేశంలో విజయవాడ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే మూడు సార్లు టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన తాను మరోసారి ఆ బాధ్యతలు స్వీకరించబోనని ప్రకటించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నగర బాధ్యతలను ఎవరికి అప్పగించినా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అనంతరం సమావేశం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కృష్ణా జిల్లా నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ భేటీకి టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు హాజరయ్యారు.

More Telugu News