Andhra Pradesh: ఏపీలో పింఛన్ల పంపిణీలో అవకతవకలు.. సీఎం జగన్ ను నిలదీసిన నారా లోకేశ్!

  • వారం రోజులు దాటాక పెన్షన్ ఇస్తున్నారు
  • అందులోనూ తొలుత సగమే అందిస్తున్నారు
  • వైసీపీ నాయకులు రూ.50 లాక్కుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ లో వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం పెన్షన్లు అందిస్తున్న తీరును టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా తప్పుపట్టారు. చాలాచోట్ల చినిగిన పాతనోట్లను ఇస్తుంటే, మరికొన్ని చోట్ల వైసీపీ నేతలు దివ్యాంగుల నుంచి రూ.50 వసూలు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ..‘ముఖ్యమంత్రి గారూ, ప్రతీనెలా 1వ తేదీనే అందుకునే పింఛను గత నెల వారం దాటాక ఇచ్చి, ఈ నెల సగమే ఇచ్చి అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు.

పింఛను రూ.వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చి రూ.250 మాత్రమే పెంచారు. ఈ రూ.250లో మీ వైసీపీ నాయకులు పెట్టిన హుండీలో రూ.50 వేయాలి. మిగిలిన సొమ్ముకి చిరిగిపోయిన నోట్లిచ్చి ముసలోళ్ల నోరు కొడుతున్నారు. నా పింఛను మొత్తం ఇవ్వలేదని అవ్వ అడుగుతోంది. చినిగిపోయిన నోట్లిచ్చి మోసం చేశారని తాత నిలదీస్తున్నాడు. పింఛనులో సగమే ఇచ్చారయ్యా అంటోంది ఓ వితంతువు. వైకాపా నేత నా దగ్గర రూ.50 తీసుకుంటున్నాడని వాపోతున్నాడు దివ్యాంగుడు’ అని ఘాటుగా విమర్శించారు.

More Telugu News