Andhra Pradesh: లోకేశ్ బాబూ.. ‘అన్నక్యాంటీన్ల’ను మీ హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా?: విజయసాయిరెడ్డి

  • టీడీపీపై ప్రభుత్వం పగ సాధిస్తోందన్న లోకేశ్
  • లోకేశ్ ఆరోపణల్ని తిప్పికొట్టిన వైసీపీ నేత
  • రూ.43 కోట్ల నిధుల్ని మళ్లించారని ఆరోపణ

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ‘అన్న క్యాంటీన్ల’పై ఇటు టీడీపీ అటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పలుచోట్ల అన్న క్యాంటీన్లను మూసివేయడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా, వైసీపీ నేతలు వాటిని తిప్పికొడుతున్నారు. తెలుగుదేశంపై పగ సాధించడానికే వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసిందన్న లోకేశ్ విమర్శలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. అన్న క్యాంటీన్లను హెరిటేజ్ సొమ్ముతో ఏమీ నడపలేదని వ్యాఖ్యానించారు. అన్న క్యాంటీన్లకు కేటాయించిన నిధుల్లో రూ.43 కోట్లను పసుపు-కుంకుమకు మళ్లించారని ఆరోపించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘అన్న క్యాంటీన్లను మీ హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ? మూసేశారని టీఎంసీల కొద్ది కన్నీరు కారుస్తున్నావు. మీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా దోచుకునేందుకే మొదలుపెట్టారు. క్యాంటీన్ నిధులను పసుపు-కుంకుమ ప్రలోభాలకు మళ్లించి రూ.43 కోట్ల బకాయి పెట్టారు’ అని దుయ్యబట్టారు.

More Telugu News