chattisgargh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులను కాల్చిచంపిన భద్రతాబలగాలు!

  • రాజ్ నంద్ గావ్ జిల్లాలోని సీతాగోటాలో ఘటన
  • నిఘావర్గాల సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్
  • మావోల కోసం ఇంకా కొనసాగుతున్న వేట

పచ్చటి అడవి మరోసారి ఎర్రబారింది. ప్రశాంతంగా ఉండే కొండల్లో తుపాకులు గర్జించాయి. ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాలో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. జిల్లాలోని సీతాగోటా అటవీప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు బలగాలకు నిఘావర్గాలు సమాచారం అందించాయి. వెంటనే అప్రమత్తమైన డీఆర్జీ ప్రత్యేకదళం కూంబింగ్ ప్రారంభించింది. అడవిలోకి కొద్దిదూరం వెళ్లగానే బలగాల రాకను పసిగట్టిన మావోలు బుల్లెట్ల వర్షం కురిపించారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. బలగాలు వెంటనే ప్రతిస్పందించడంతో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. మిగతావారు కాల్పులు జరుపుతూ ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ జరిగిన చోటు నుంచి భారీ సంఖ్యలో తుపాకులు, బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మావోయిస్టులను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

More Telugu News