thief: గల్లా పెట్టె ఖాళీగా వుండడం చూసి.. దుకాణదారుపై దొంగ గారి అక్కసు!

  • కిరాణ దుకాణంలో చోరీకి వచ్చిన దొంగ
  • వస్తువులు చెల్లాచెదరు చేసిన వైనం 
  • పేపరుపై తన బాధను రాసి వెళ్లిపోయిన దొంగ

ఓ కిరాణ దుకాణంలో దొంగతనానికి వెళ్లిన చోర శిఖామణికి అక్కడ ఒక్క రూపాయి కూడా కనిపించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. డబ్బుల కోసం వెతికి వేసారిన దొంగ చివరికి తన అసహనాన్ని, కోపాన్ని చూపించాడు. షాపులోని బియ్యం, శనగపిండి ఇతర బస్తాలను బ్లేడుతో కోసేశాడు. సామాన్లను చిందరవందర చేసి అక్కసు ప్రదర్శించాడు. అక్కడితో ఆగక తన బాధను వ్యక్తం చేస్తూ దుకాణదారుడికి ఓ లేఖ కూడా రాశాడు.

ప్రాణాలకు తెగించి చోరీకి వస్తే గల్లా పెట్టె ఖాళీగా కనిపించడం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ పేపర్‌పై రాసి దానిని లోపల వేలాడదీశాడు. డబ్బులు లేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, అందుకే లోపలి వస్తువులను చెల్లాచెదరు చేశానని, ఈ కోతి చేష్టలు అందుకేనని దానిపై రాశాడు.

ఉదయం షాపు తెరిచిన దుకాణ యజమాని లోపలి పరిస్థితి చూసి విస్తుపోయాడు. దొంగ రాసిన కాగితం ముక్క చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమిళనాడులోని కడలూరు జిల్లా నైవేలి మందారకుప్పంలో జరిగిందీ ఘటన.

More Telugu News