Bay Of Bengal: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం... అల్లకల్లోలంగా సముద్రం

  • ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన
  • మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక  
  • ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించిన ఆర్టీజీఎస్

ఓవైపు నైరుతి రుతుపవనాలు దేశంలో పలుచోట్ల భారీ వర్షపాతానికి కారణమవుతున్న వేళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది.

ముఖ్యంగా, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 5 వరకు తీరప్రాంతాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సామాన్య ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లరాదని స్పష్టం చేశారు.

More Telugu News