Ravan: రావణాసురుడే తొలి విమాన పైలట్... సైన్స్ పరంగా నిరూపిస్తామంటున్న శ్రీలంక!

  • 5 వేల ఏళ్ల క్రితమే విమానం
  • లంక నుంచి ఇండియాకు ప్రయాణం
  • ఐదేళ్లలో నిరూపిస్తామంటున్న లంక

ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా విమానాన్ని నడిపించినది రావణాసురుడేనని, 5 వేల సంవత్సరాల క్రితమే ఆయన వైమానికుడన్న విషయాన్ని తాము సాంకేతికంగా నిరూపిస్తామని శ్రీలంక చెబుతోంది. ఈ విషయాన్ని తాము నిరూపించేందుకు ఐదు సంవత్సరాల కాలం పట్టవచ్చని శ్రీలంక సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ శశి దానతుంగే వ్యాఖ్యానించారు.

భారత వార్తా సంస్థ 'న్యూస్‌18'కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, విమానాన్ని ఉపయోగించి గగనతలంలో విహరించిన తొలి వైమానికుడు రావణుడేనని స్పష్టం చేశారు. తానేమీ పురాణాల ఆధారంగా ఈ విషయం చెప్పడం లేదని, దీనిపై పూర్తి స్థాయి పరిశోధన చేస్తున్నామని, సాంకేతికంగా నిరూపిస్తామని ఆయన అన్నారు. బండారునాయకే విమానాశ్రయంలో శ్రీలంక పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సమావేశం బుధవారం జరిగింది.

 5,000 ఏళ్ల క్రితమే రావణుడు శ్రీలంక నుంచి ఇండియాకు విమానంలో వెళ్లి వచ్చాడని ఈ సమావేశం తేల్చడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని సాంకేతికంగానూ నిరూపించాలని సదస్సులో పాల్గొన్న అధికారులు, వక్తలు నిర్ణయించారు. కాగా, శ్రీలంకలో రావణాసురుడిని దేవుడిగా కొలుస్తారన్న సంగతి తెలిసిందే. సీతాదేవిని అపహరించాడన్న కారణంతో రావణుడిని రాక్షసుడంటే వారు అంగీకరించరు. ఈ ప్రచారం కేవలం భారతీయులు చేస్తున్న తప్పుడు ప్రచారమేనని అంటారు.

More Telugu News