Lottery: లాటరీలో శాంసంగ్ ఫోన్ వచ్చిందంటూ టోకరా!

  • కడప జిల్లాలో ఘటన
  • ఫోన్ వస్తే నమ్మేసిన యువకుడు
  • డబ్బు కట్టాక తెలిసిన అసలు నిజం

తనకు 17 వేల రూపాయల శాంసంగ్ మొబైల్ ఫోన్ లాటరీలో తగిలిందన్న ఆనందం ఆ యువకుడికి నిమిషాల పాటు కూడా నిలవలేదు. సంతోషంతో పోస్టాఫీసుకు వెళ్లి డబ్బులు కట్టి, ప్యాక్ తీసుకుని విప్పి చూడగా అందులో పీచు మిఠాయి కనిపించడంతో అవాక్కయ్యాడు. ఈ ఘటన కడప జిల్లా చక్రాయపేట మండలం వీరనారాయణపల్లెలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, షేక్ మౌలా అనే యువకుడికి ఫోన్ వచ్చింది. అతని ఫోన్ నంబర్ కు లక్కీ డ్రా తగిలిందని, శాంసంగ్ మొబైల్ ను పంపుతున్నామని, పోస్టాఫీస్ కు వెళ్లి రూ. 1,500 మాత్రం కట్టి ఫోన్ తీసుకోవాలని చెప్పారు. దీన్ని నమ్మిన మౌలా, పోస్టాఫీస్ కు వెళ్లి, తన పేరిట వచ్చిన పార్శిల్ ను తీసుకున్నాడు. ఇంటికెళ్లి విప్పి చూడగా, మిఠాయి, చిన్న ఆంజనేయుని బొమ్మ ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు 7349500889, 9606694048 నెంబర్ల నుంచి ఫోన్‌ చేశారని బాధితుడు తెలిపారు.

More Telugu News