Wife: ప్రేమించి, పెళ్లాడి వేధింపులు... ఊచలు లెక్కిస్తున్న హైదరాబాద్ యువకుడు!

  • యువతితో స్నేహం ప్రేమగా మారగా వివాహం
  • ఆపై భర్త నిర్వాకాలు తెలుసుకున్న భార్య
  • వివాదం తలెత్తడంతో వేధింపులు

ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ముఖం చాటేయడంతో పాటు భార్యను కాల్ గర్ల్ గా చిత్రీకరించి, ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. రాచకొండ పోలీసు అధికారులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, మహేశ్వరం మండలం కల్వకోలెకు చెందిన పీ రవీందర్‌ ఓ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. అదే ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ స్టాఫ్ నర్సుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆపై సదరు యువతి వేరే ఆసుపత్రిలో చేరి, మరో ప్రాంతానికి మారగా, ఉద్యోగం మానేసిన రవీందర్, యువతి వద్దకు వెళ్లి, వాళ్ల ఇంట్లోనే ఉంటూ, ఓ గుడిలో వివాహం చేసుకున్నాడు.

ఆపై వారి కాపురంలో గొడవలు వచ్చాయి. తన భర్తకు అనేకమంది స్నేహితురాళ్లు ఉన్నారని తెలుసుకున్న ఆమె నిలదీయగా, భార్యను దూరం పెట్టడం ప్రారంభించాడు. గొడవలు ముదిరి, ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయంలో ఆమె పోలీసులను ఆశ్రయించినా, రవీందర్ పట్టుబడక పోవడంతో కేసులో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో భార్యను వేధించాలన్న ఉద్దేశంతో, ఆమె పేరిట ఫేస్ బుక్ ఖాతాను తెరవడంతో పాటు ఆమెను కాల్ గర్ల్ గా చిత్రించాడు. తనతో దిగిన సెల్ఫీలను మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేశాడు. అసభ్యకర మెసేజ్ లను పెట్టాడు. దీంతో యువతి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసును నమోదు చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.

More Telugu News