Tamilnadu: కన్న తల్లిని చంపిన తమిళనాడు మాజీ ఎంపీ 'పుత్రరత్నం' అరెస్ట్!

  • ఏప్రిల్ లో ఎంపీ కుళందైవేలు భార్య హత్య
  • కన్న తల్లిని హత్య చేసిన ప్రవీణ్
  • న్యూఢిల్లీలో గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు

తమిళనాడు తిరుచెంగోడు మాజీ ఎంపీ అన్నాడీఎంకే నేత కుళందైవేలు భార్య రత్నం హత్య కేసు నిందితుడు, తప్పించుకు తిరుగుతున్న వారి కుమారుడు ప్రవీణ్ ను న్యూఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాల్లోకి వెళితే, కుళందైవేలు, అతని భార్య రత్నం (63) చెన్నై శాస్త్రీనగర్‌ లోని ఆరో అవెన్యూలో నివాసం ఉంటుండగా, వీరికి సుధ అనే కుమార్తె, ప్రవీణ్‌ (35) అనే కుమారుడు ఉన్నారు.

నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో కుళందైవేలు మరణించగా, ఆపై విదేశాలకు ఉన్నత విద్య నిమిత్తం వెళ్లిన ప్రవీణ్‌, మార్చిలో విదేశీ అమ్మాయిని వివాహమాడి ఇండియాకు తిరిగి వచ్చాడు. ప్రవీణ్ వచ్చిన తరువాత వారి కుటుంబంలో ఆస్తి పంపకాలకు సంబంధించి పెద్ద తగాదాలే జరిగాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 14న రత్నం చేతులు, కాళ్లు కట్టివేసి, గొంతు కోసి, గుండెలపై కత్తితో దాడి చేసి హతమార్చాడు ప్రవీణ్.

ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. హత్య తరువాత మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, బయట నుంచి గడియవేసిన ప్రవీణ్ తప్పించుకుని పారిపోయాడు. హత్యపై కేసు నమోదు చేసిన శాస్త్రినగర్‌ పోలీసులు, ప్రవీణ్‌ కోసం గాలిస్తుండగా, అతను ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News