Madhya Pradesh: బావను పెళ్లాడాలని... అక్కను హత్య చేసిన చెల్లి!

  • మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన
  • గర్భవతని చూడకుండా సోదరి హత్య 
  • పారిపోతుంటే పట్టుకున్న స్థానికులు

సొంత బావపై మనసు పడిన ఓ యువతి, బావను పెళ్లి చేసుకోవాలంటే, అక్కే అడ్డని భావించి, ఆమెను హత్యచేసి, ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లి, తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసుకుంది. ఆ సమయంలో అక్క గర్భవతని, ఆమె కడుపులోని మరో ప్రాణం కూడా  బలవుతుందన్న ఆలోచన లేకుండా దారుణంగా ప్రవర్తించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా కైత్రాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, అభిలాష (27), షతక్షి (19) అక్కాచెల్లెళ్లు కాగా, అభిలాషకి కొంతకాలం క్రితం వివాహమైంది.

వివాహం తరువాత ఆమెకు గర్భం రాగా, పురుడు నిమిత్తం పుట్టింటికి వచ్చింది. అప్పటికే బావపై మనసుపడి, వ్యామోహం పెంచుకున్న షతక్షి, బావను పెళ్లాడాలంటే, అక్కే అడ్డన్న ఆలోచనతో, బాత్ రూమ్ కు వెళ్లిన అక్కపై కత్తితో దాడి చేసింది. మెడపై కడుపులో విచక్షణా రహితంగా పొడిచేసింది. బాధితురాలు కేకలు పెడుతుండగా, ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి, అభిలాషను ఆసుపత్రికి తరలించినా, ప్రయత్నం లేకపోయింది.

తీవ్ర రక్తస్రావం కారణంగా ఆమె మరణించగా, ఘటనా స్థలి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన షతక్షిని స్థానికులు అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. కాగా, అక్కను ఎలాగైనా హత్య చేయాలని భావించిన షతక్షి, ఇప్పటికే రెండుసార్లు హత్యా ప్రయత్నం చేసి విఫలమైందని, మూడోసారి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందని పోలీసులు విచారణ అనంతరం వెల్లడించారు. నిందితురాలిని కోర్టు ముందు హాజరు పరిచి, రిమాండుకి తరలించారు. 

More Telugu News