MGBS: నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు.. ఉద్యోగం కోసం వెళ్లా: హయత్ నగర్ విద్యార్థిని సంచలన వ్యాఖ్యలు

  • తాను కిడ్నాపర్ చెరలో ఉన్నానన్న విషయాన్ని గ్రహించలేకపోయిన విద్యార్థిని
  • అద్దంకి నుంచి బస్సులో ఎంజీబీఎస్‌కు
  • నెల్లూరులో పట్టుబడిన కిడ్నాపర్ రవిశేఖర్?

హైదరాబాద్, హయత్‌నగర్‌లో ఈ నెల 23న కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థిని ఆచూకీ వారం రోజుల తర్వాత మంగళవారం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికిన మోస్ట్ వాంటెడ్ ఘరానా మోసగాడు రవిశేఖర్ ఆమెను కారులో అపహరించుకుని తీసుకెళ్లాడు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.  

రవిశేఖర్ కోసం ఓవైపు పోలీసులు గాలిస్తుండగా మరోవైపు మంగళవారం తెల్లవారుజామున ఆమె ఎంజీబీఎస్‌లోని దేవరకొండ ఫ్లాట్‌ఫాం వద్ద  ప్రత్యక్షమైంది. బాధితురాలిని గుర్తుపట్టిన స్నేహితురాలు.. మీడియాలో వస్తున్న వార్తల గురించి చెప్పి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావని ప్రశ్నించింది. దీనికి ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీంతో ఆమె బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడించింది.

విషయాన్ని వారు పోలీసులకు చెప్పడంతో అందరూ కలిసి ఎంజీబీఎస్‌కు చేరుకుని ఆమెను తీసుకెళ్లారు. ఆమెను విచారించిన పోలీసులు సాయంత్రం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కాగా, కిడ్నాప్ చెరలో వారం రోజులు ఉన్న ఆమె.. తనను అతడు కిడ్నాప్ చేశాడన్న విషయాన్ని తెలుసుకోలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వారం రోజులుగా ఆమె అతడి వెంట ఉన్నప్పటికీ తల్లిదండ్రులతో ఒక్కసారి కూడా మాట్లాడించకుండా నిందితుడు రవిశేఖర్ ఎలా మేనేజ్ చేశాడన్న విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదు.

ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి బాధిత యువతి బస్సులో ఎంజీబీఎస్ బస్టాండుకు చేరుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, కిడ్నాపర్‌ రవిశేఖర్‌ అద్దంకి నుంచి తిరుపతి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నెల్లూరు జిల్లాలోని ఓ చెక్‌పోస్టు వద్ద రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

More Telugu News