Hyderabad: భర్త ఫోన్‌లో అమ్మాయిల ఫోన్ నంబర్లు.. నిలదీసినందుకు ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో అసభ్య ఫొటోల పోస్టింగ్

  • ప్రేమించి పెళ్లాడిన యువకుడు
  • మనస్పర్థలతో సొంతూరికి వెళ్లిపోయిన యువకుడు
  • నిందితుడికి పోలీసుల అరదండాలు

భర్త వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అమ్మాయిల ఫోన్ నంబర్లు కనిపించడంతో భార్య నిలదీసిందన్న కోపంతో ఆమె అసభ్యకర చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడో ప్రబుద్ధుడు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా  మహేశ్వరం మండలం కల్వకోల్‌కు చెందిన యువకుడు (27) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. మార్చి 2015లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత భార్య మెయిల్ ఐడీతో యువకుడు ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. దీనిని ఆమె కూడా తరచూ చూసేది. అయితే, గతేడాది జనవరిలో భర్త వాట్సాప్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో అమ్మాయిల ఫోన్ నంబర్లు చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఉద్యోగం మానేసిన నిందితుడు స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భార్యపై కోపంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న అసభ్యకర చిత్రాలను ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేస్తూ, వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

More Telugu News