Vijay: హీరో విజయ్ చనిపోయాడన్న ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసిన టీమిండియా క్రికెటర్

  • తమిళ యువత తీరును తప్పుబట్టిన రవిచంద్రన్ అశ్విన్
  • అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ట్వీట్
  • దేశంలో పరిస్థితులు తెలుసుకోవాలంటూ హితవు

తమిళ హీరోలు విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఎప్పటినుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది. తాజాగా, అజిత్ అభిమానులు విజయ్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా  ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళ సినీ సోషల్ మీడియా గ్రూపుల్లో ఎక్కడ చూసినా 'రిప్ యాక్టర్ విజయ్' అంటూ హ్యాష్ ట్యాగ్, విజయ్ మరణించినట్టుగా ఓ ఫొటో దర్శనమిస్తున్నాయి.

దీనిపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓవైపు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా, మన ప్రియమైన రాష్ట్రానికి చెందిన యువత మాత్రం 'రిప్ యాక్టర్ విజయ్' అంటూ ట్రెండింగ్ లో మునిగిపోయిందని వ్యాఖ్యానించాడు.

"కొన్నిరోజుల క్రితం ఓ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చినా, అదృష్టంకొద్దీ ఆ ప్రమాదం తప్పింది. రుతుపవనాలు గాడితప్పడంతో దేశంలో వరదలు వస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షం లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ యువత అనవసర విషయాలను ట్రెండింగ్ చేస్తూ బిజీగా ఉంది" అంటూ అశ్విన్ విమర్శించాడు.

More Telugu News