Swathi Maliwal: ఉన్నావో అత్యాచార బాధితురాలిది రోడ్డు ప్రమాదం కాదు: ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్ పర్సన్

  • బాధితురాలితో పాటు లాయర్ పరిస్థితి విషమం
  • మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించాలి
  • ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా పట్టించుకోవట్లేదు

ఉన్నావో అత్యాచార బాధితురాలితో పాటు ఆమె లాయర్ పరిస్థితి విషమంగా ఉందని, వారిద్దరినీ మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించాలని వైద్యులు సూచించారని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌ తెలిపారు. నేడు ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో రోడ్డు ప్రమాదానికి గురై లక్నోలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలితో పాటు లాయర్ పరిస్థితి విషమంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న స్వాతి మలివాల్ ట్విట్టర్ వేదికగా పరిస్థితిని వివరించి, కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు.

వైద్యుల సూచన మేరకు బాధిత కుటుంబాలు కూడా మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ తరలించాలని కోరుకుంటున్నాయని ట్విట్టర్ ద్వారా స్వాతి వెల్లడించారు. తాను ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడుతున్నానని, ఢిల్లీ తీసుకెళ్లే బాధ్యతను తాను చూస్తానన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాధితురాలు ప్రమాదానికి గురై గంటలు గడుస్తున్నా పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపించారు. అది నిజానికి ప్రమాదం కాదని ఏదో కుట్ర దాగుందని, బాధితురాలు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కమిషన్ వారి వెంటే ఉంటుందని స్వాతి స్పష్టం చేశారు.

డీజీపీ మాత్రం దానిని ప్రమాదంగా పేర్కొంటున్నారని, యోగి వచ్చి బాధితురాలిని చూడాలని కోరారు. నిందితుడిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి, కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని స్వాతి కోరారు. 15 రోజుల్లోగా నిందితుడిని ఉరి తీయాలని, అతడిని వదిలేస్తే దేశంలో మరికొందరు నిర్భయలు నిరాశ చెందుతారని యోగి ఆదిత్య నాథ్‌కు ట్యాగ్ చేస్తూ స్వాతి ట్వీట్ చేశారు.

More Telugu News