Hyderabad: నీలిచిత్రాలు చూపిస్తూ అలాగే చేయాలని వేధింపులు...లేదంటే విడాకులిస్తానని బెదిరింపులు

  • కట్టుదాటిన ఓ భర్తపై మహిళ పోలీసులకు ఫిర్యాదు
  • కొన్నాళ్లుగా శారీరకంగా, మానసికంగా హింస
  • చివరికి కొట్టడంతో తట్టుకోలేకపోయిన భార్య 

‘నాతి చరామి’ అంటూ ఆమె మెడలో తాళికట్టిన వ్యక్తి ఆమెకు జీవితాంతం తోడుగా ఉండడం మాట పక్కనపెట్టి పెళ్లయిన కొన్నిరోజుల్లోనే తనలోని మరో మనిషిని బయటపెట్టాడు. నీలి చిత్రాలు చూపిస్తూ అలాగే చేయాలని, తాను ఎవరి వద్దకైనా వెళ్లాలంటే వెళ్లాల్సిందేనంటూ నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో ఇక భరించలేని ఆమె న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు, పోలీసుల కథనం మేరకు, బంజారాహిల్స్‌ శ్రీనగర్‌ ప్రాంతంలో రఘు (35) దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొన్ని నెలలపాటు వీరి జీవితం సాఫీగా సాగింది. ఆ తర్వాత రఘులోని మరోమనిషి బయటకు రావడం మొదలయ్యింది.

రాత్రిపూట సెల్‌ ఫోన్‌లో భార్యకు నీలి చిత్రాలు చూపిస్తూ అలాగే చేయాలంటూ ఒత్తిడి చేసేవాడు. దీనికి ఆమె ససేమిరా అంటే హింసించేవాడు. భర్త చెప్పినట్లు భార్య వినాలని, మరొకరితో పడక సుఖం పంచుకోవాలన్నా పంచుకోవాల్సిందేనని విచిత్రమైన నిబంధనలు విధించేవాడు. ఆమె ససేమిరా అనడంతో మరింత హింసించడం మొదలు పెట్టాడు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఆమె డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు తీసుకున్నాడు. నెలనెలా జీతం మొత్తం లాగేసుకునేవాడు.

పెళ్లికి ముందు ఆమె దాచుకున్న డబ్బునూ తీసుకున్నాడు. తల్లిదండ్రులకు ఏ సాయం చేసినా చంపేస్తానంటూ బెదిరించేవాడు. తాను చెప్పింది చేయకుంటే తనకు విడాకులు ఇవ్వాలని కోరేవాడు. ఈనెల 26న ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంతరం బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. భర్త పెడుతున్న హింసను భరిస్తూ వచ్చిన ఆమె చివరికి లైంగిక వేధింపులు శ్రుతిమించడంతో తట్టుకోలేకపోయింది. పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై 498(ఎ), 506 సెక్షన్‌ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News