Polavaram: పోలవరం డ్యామ్ పై స్పిల్ వే గేటు తొలగింపు!

  • ఇప్పటికే ఆగిన ప్రాజెక్టు పనులు
  • నెమ్మదిగా తప్పుకుంటున్న సబ్ కాంట్రాక్టర్లు
  • వరద పెరిగితే స్పీల్ వేపై నుంచి మళ్లిస్తాం
  • అందుకే గేటు తీశామంటున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు ఆగిపోగా, ఇప్పుడు ఏడాదిన్నర క్రితం చంద్రబాబు పెట్టించిన ఒక స్పిల్ వే గేటును అధికారులు తొలగించారు. స్పిల్ వేలో భాగంగా గత సంవత్సరం చంద్రబాబు ఓ గేటును ప్రారంభించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మొత్తం 48 గేట్లను ప్రాజెక్టుకు అమర్చాల్సి వుంది.

బెకమ్ కంపెనీ ఇప్పటికే ఈ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులను పూర్తి చేసింది. పిల్లర్ల పనులు ప్రారంభమైతే వీటిని బిగించే పనులు మొదలవుతాయి. కాగా, గోదావరికి వరదలు వచ్చే సమయం కాబట్టి, వరద ఉద్ధృతి పెరిగితే, స్పిల్‌ వే పైనుంచి నీటిని మళ్లిస్తామని, అందుకే గేటును తొలగించామని అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, ఈ సంవత్సరం గోదావరిలో 8 లక్షల క్యూసెక్కుల వరకూ వరద ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంత వరద వచ్చినా కాపర్ డ్యామ్ కు నష్టం ఉండదని భరోసా ఇస్తున్నారు.

More Telugu News