Mukesh Goud: కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్ గౌడ్ ఆరోగ్యం విషమం.. అపోలో ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు

  • ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ముఖేశ్ గౌడ్
  • ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందన్న వైద్యులు
  • చూసేందుకు తరలివస్తున్న నేతలు, అభిమానులు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆదివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. విషయం తెలిసిన ముఖేశ్ గౌడ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి తరలి వస్తున్నారు.

విద్యార్థి దశ నుంచే ఆయన కాంగ్రెస్ నేతగా ఉన్నారు. తొలుత ఎన్ఎస్‌యూఐలో పనిచేశారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌లో ముఖ్య పాత్ర పోషించారు. 1986లో జాంబాగ్‌ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి బీసీ శాఖా మంత్రిగా పనిచేశారు. 2009లో మార్కెటింగ్ శాఖ బాధ్యతలు చేపట్టి పూర్తికాలం పనిచేశారు. 2014, 2018లలో అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

More Telugu News