Guntur District: భార్యపై అనుమానంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న యువకుడి హత్య

  • తన ముందే తన భార్యతో ఫోన్‌లో మాట్లాడడంతో ఆగ్రహం
  • వైన్‌ షాపులో అందరూ చూస్తుండగానే గొంతులో కత్తితో పొడిచి దారుణం
  • తణుకు మండలం దువ్వలో ఘటన

తన భార్యతో సన్నిహితంగా ఉంటున్న ఓ వ్యక్తి, తన ముందే ఆమెతో ఫోన్‌లో మాట్లాడడంతో తట్టుకోలేక గొంతులో కత్తితో పొడిచి హత్యచేసిన సంఘటన ఇది. ఈ ఘటనలో కామన బాలాజీ (24) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తణుకు మండలం దువ్వలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

మొగల్తూరు గ్రామానికి చెందిన గుడాల శివరామకృష్ణ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన రోజారమణితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. కొన్నాళ్ల క్రితం  దువ్వకు చెందిన బాలాజీ అనే యువకుడిని రోజారమణి, శివరామకృష్ణకు పరిచయం చేసింది. బాలాజీని కొన్నాళ్లుగా గమనిస్తున్న శివరామకృష్ణ  అతను తన భార్యకు సన్నిహితంగా ఉంటున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై బాలాజీని ఓ సందర్బంలో హెచ్చరించాడు. ఫలితం లేకపోయింది. ఈ నేపధ్యంలో రోజారమణి రెండు నెలల క్రితం ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లింది.

బాలాజీ ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు శివరామకృష్ణ గమనించాడు. దీనిపై రెండుసార్లు గట్టిగా హెచ్చరించాడు. బాలాజీ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపాడు. అయినా బాలాజీలో మార్పు రాలేదు. దీంతో అతన్ని లేపేయాలన్న నిర్ణయానికి  వచ్చాడు. ఈ నేపధ్యంలో శుక్రవారం రాత్రి బాలాజీయే శివరామకృష్ణకు ఫోన్‌ చేసి మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందామని, అందుకు దువ్వరావాలని చెప్పాడు. ఇద్దరూ ఓ మద్యం దుకాణంలో మట్లాడుకుంటుండగా వారి మధ్య రోజారమణి విషయంపై మరోసారి ఘర్షణ తలెత్తింది.

అదే సమయంలో బాలాజీ దుబాయ్ లోని రోజారమణికి ఫోన్‌ చేసి ఆమెతో మాట్లాడాడు. దీన్ని అవమానంగా భావించిన శివరామకృష్ణ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో బాలాజీ గొంతులో పొడిచాడు. తీవ్ర గాయమైన బాలాజీ రక్షించాలంటూ పరిసర ప్రాంతాల్లో కలియతిరిగాడు. కాసేపటికి రక్తపు మడుగులో పడి ప్రాణాలు వదిలాడు. దీంతో శివరామకృష్ణ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

More Telugu News