Chandrababu: శివాజీతో 'గరుడ పురాణం' చెప్పించింది చంద్రబాబే: కన్నా లక్ష్మీనారాయణ

  • పనిగట్టుకుని దుష్ప్రచారం చేయిస్తున్న చంద్రబాబు
  • ఎల్లో మీడియాను వాడుకుంటున్నారు
  • హోదా ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదన్న కన్నా

నటుడు శివాజీ చెప్పిన 'గరుడ పురాణం' వెనుక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన కన్నా, ఏపీలో బీజేపీని అణిచి వేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వెనకున్న ఎల్లో మీడియాను ఇందుకోసం వాడుకుంటున్నారని, పనిగట్టుకుని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదని మరోసారి స్పష్టం చేసిన ఆయన, హోదాకు సమానమైన సాయాన్ని కేంద్రం ఇస్తోందని అన్నారు. ప్యాకేజీకి అంగీకరించి, కేంద్ర నేతలకు సన్మానం కూడా చేసిన చంద్రబాబు, ఆపై ఎన్నికల్లో లాభం కోసం బీజేపీపై ఆరోపణలు ప్రారంభించారని అన్నారు. కర్ణాటకలో అతిపెద్ద పార్టీ తమదే అయినా, అక్రమ పొత్తుతో కాంగ్రెస్ - జేడీఎస్ అధికారంలోకి వచ్చాయని, ఇప్పుడు వారిలో వారు గొడవపడి ప్రభుత్వాన్ని కూల్చుకున్నారని కన్నా వ్యాఖ్యానించారు. దేశ యువత ఇప్పుడు బీజేపీవైపు చూస్తోందని అన్నారు.

More Telugu News