Tamil Nadu: అమ్మో...వీడు మామూలోడు కాదు : పదేళ్లలో నలుగురిని పెళ్లాడాడు

  • ఒకరికి తెలియకుండా మరొకరికి మూడు ముళ్లు
  • పెద్ద భార్య ఆరా తీయడంతో వెలుగు చూసిన నిజం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మొదటి భార్య

హిందూ సంప్రదాయంలో ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం చట్టప్రకారం నేరం. కానీ అతను పదేళ్ల వ్యవధిలో నలుగురిని పెళ్లాడాడు. అదీ ఒకరికి తెలియకుండా మరొకరిని. ఏం చెప్పాడో...ఎలా మేనేజ్‌ చేసుకుంటూ వచ్చాడో. చివరికి వ్యూహం బెడిసికొట్టి విషయం బయటపడింది. మొదటి భార్య ఫిర్యాదుతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా అళగన్‌కులం ప్రాంతానికి చెందిన కోట్టైరాజు కుమార్తె కోమలాదేవి, మాడకోట్టాన్‌ ప్రాంతానికి చెందిన రాము కొడుకు గంగాధరన్‌లు దంపతులు. వీరికి 2008లో శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకు గంగాధరన్‌ ఉద్యోగం వెతుక్కుంటూ దుబాయ్‌ వెళ్లాడు. ఆ తర్వాత భార్యను తీసుకువెళ్లాడు. దుబాయ్‌లో గంగాధరన్‌ పబ్‌లు, క్లబ్‌లు అంటూ జల్సాలు చేస్తూ తిరుగుతుండడంతో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.  దీంతో కోమలాదేవిని రామనాథపురంలో వదిలేసి గంగాధరన్‌ మళ్లీ దుబాయ్ వెళ్లిపోయాడు.

కాగా, ఇటీవల దుబాయ్‌ నుంచి గంగాధరన్‌ ఇంటికి వచ్చాడు. రాత్రి 12 గంటల సమయంలో అతని ఫోన్‌కు కాల్‌ వచ్చింది. అనుమానం వచ్చిన కోమలాదేవి అదే నంబర్‌కు తిరిగి ఫోన్‌ చేయగా మాట్లాడిన మహిళ తాను గంగాధరన్‌ భార్యను అని చెప్పింది. మరి కాస్త ఆరాతీయగా సేలం జిల్లాకు చెందిన కవిత అనే మహిళను గంగాధరన్‌ పెళ్లి చేసుకున్నట్లు తేలింది.

అదే విషయాన్ని భర్త వద్ద ప్రస్తావించగా కవిత ఎవరో తనకు తెలియదని బుకాయించాడు. అయినా పట్టువదలని కోమలాదేవి భర్త వ్యవహారాలపై ఆరాతీయగా యమున, దీప అనే మరో ఇద్దరిని కూడా గంగాధరన్‌ పెళ్లాడాడని తెలియడంతో విస్తుపోవడం ఆమె వంతయింది. మాయమాటలతో మహిళలకు వలవేసి పెళ్లితో వారిని మోసం చేయడం భర్తకు అలవాటుగా మారిందని భావించిన కోమలాదేవి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More Telugu News