Congress Leaders: కిడ్నాపర్లు అనుకుని కాంగ్రెస్ నేతలను చితకబాదిన గ్రామస్థులు

  • గ్రామంలో కిడ్నాపర్లు తిరుగుతున్నారన్న వార్తలు హల్‌చల్
  • కారులో వెళ్తున్న నేతలను కిడ్నాపర్లుగా పొరబడిన గ్రామస్థులు
  • తాము నేతలమని చెబుతున్నా వినిపించుకోకుండా వడ్డించిన వైనం

కిడ్నాపర్లు అనుకుని కారులో వెళ్తున్న ముగ్గురు కాంగ్రెస్ నేతలను పట్టుకుని గ్రామస్థులు చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో జరిగింది. నవల్‌సింహ్ గ్రామంలోకి పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా ప్రవేశించిందన్న వార్తలు గురువారం రాత్రి గుప్పుమన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ నేతలైన ధర్మేంద్ర శుక్లా, ధర్ముసింగ్ లాంజీవర్, లలిత్ భాస్కర్‌లు కారులో ప్రయాణిస్తున్నారు. వారు కిడ్నాపర్లేనని భావించిన గ్రామస్థులు చెట్ల కొమ్మలు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు.

రోడ్డుపై చెట్ల కొమ్మలు చూసిన నేతలు దొంగలే ఆ పనిచేసి ఉంటారని భావించారు. కారు దిగి అటూఇటూ చూస్తూ చెట్ల కొమ్మలు తొలగించే ప్రయత్నం చేశారు. నేతలు కారు దిగగానే గ్రామస్థులు ఒక్కసారిగా వారిపై దాడిచేశారు. వారి కారును ధ్వంసం చేశారు. దీంతో భయపడిన నేతలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని చావబాదారు.

తాము కాంగ్రెస్ పార్టీ నేతలమని చెబుతున్నా వినిపించుకోలేదు. ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నేతలను వారి చెర నుంచి విడిపించారు. కిడ్నాపింగ్ ముఠాలు తిరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో గ్రామస్థులు పొరపాటు పడడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

More Telugu News