Andhra Pradesh: అవినీతి కేసుల్లో జగన్‌పై విచారణ కొనసాగుతుంది: సునీల్ దేవధర్

  • బీజేపీలో చేరికలకు అవినీతి కేసులకు సంబంధం లేదు
  • జగన్ ప్రభుత్వానికి బీజేపీ అండగా ఉంటుందనుకోవం తప్పు
  • ఏపీలో త్రిపుర తరహా వ్యూహాన్ని అమలు చేస్తాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసుల్లో విచారణ ఆగబోదని, అది కొనసాగుతూనే ఉంటుందని బీజేపీ ఏపీ కో ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన బీజేపీలో చేరికలకు, కేసులకు ఎటువంటి సంబంధం ఉండదన్నారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లపైనా విచారణ కొనసాగుతుందన్నారు. విశాఖపట్టణంలోని మాడుగులలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం అధిష్ఠానం దృష్టి మొత్తం ఏపీపైనే ఉందని, ఇతర పార్టీల బలాన్ని తగ్గించేందుకు కొంతమంది సీనియర్లు, ప్రముఖులను పార్టీలోకి చేర్చుకోవడం తప్పదని తేల్చి చెప్పారు. ఏపీలో అవినీతితో కూడిన రాజకీయం పోవాలన్న దేవధర్.. రాష్ట్రంలో త్రిపుర తరహా వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు.

సెక్యులర్ దేశంలో  మతాన్ని ప్రోత్సహించడం సరికాదని పేర్కొన్న ఆయన ఏపీలో చర్చిలకు పోలీసు భద్రత, పాస్టర్లకు వేతనాలు వంటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు చెప్పారు. జగన్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి బీజేపీ అండగా ఉంటుందని భావిస్తే అది పొరపాటే అవుతుందన్నారు. సాధ్యం కాదని చెప్పినా ఇంకా ప్రత్యేక హోదా అంటూ గొంతెత్తడం సరికాదని దేవధర్ పేర్కొన్నారు.

More Telugu News