Tollywood: ఫిలించాంబర్ ఎన్నికల్లో 'మన ప్యానెల్' ఘనవిజయం

  • ముగిసిన ఫిలించాంబర్ ఎన్నికలు 
  • సి.కల్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ తరఫున 9 మంది జయభేరి
  • యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ నుంచి దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ విజయం

ఉద్రిక్తతల నడుమ సాగిన ఫిలించాంబర్ ఎన్నికల్లో సి. కల్యాణ్ నేతృత్వంలోని 'మన ప్యానెల్' వర్గం ఘనవిజయం సాధించింది. 12 మంది ఈసీ మెంబర్స్ లో 'మన ప్యానెల్' తరఫున  9 మంది విజయం సాధించగా, ప్రత్యర్థి వర్గం 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ' ప్యానెల్ లో కేవలం దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ మాత్రమే గెలిచారు.  ఇండిపెండెంట్ గా బరిలో దిగిన మోహన్ గౌడ్ కూడా నెగ్గారు. ఇక, 20 మంది సెక్టార్ మెంబర్స్ లో 'మన ప్యానెల్' హవా కొనసాగింది. మన ప్యానెల్ నుంచి 16 మంది గెలుపొందగా, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ తరఫున నలుగురు విజయం సాధించారు.


'మన ప్యానెల్' నుంచి వైవీఎస్ చౌదరి, నట్టి కుమార్, మోహన్ వడ్లపట్ల, ఎం.శివకుమార్, కేశవరావు, సాగర్ తదితరులు పోటీ చేయగా, 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్' ప్యానెల్ తరఫున దిల్ రాజు, డీవీవీ దానయ్య, కొర్రపాటి సాయి, రవిశంకర్, దామోదర్ ప్రసాద్, ఆచంట గోపీనాథ్, కేకే రాధామోహన్, శివలెంక కృష్ణప్రసాద్, భోగవల్లి ప్రసాద్ తదితరులు పోటీ చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంటకు పూర్తయింది.

More Telugu News