Ranga Reddy District: పాతికేళ్ల క్రితం ఎటో వెళ్లిపోయాడు... ఇప్పుడు మళ్లీ రావడంతో అంతా షాక్!

  • తల్లిదండ్రులు, కుటుంబీకులను వదిలి అదృశ్యం
  • మరో పెళ్లి చేసుకున్న భార్య 
  • కాలం చేసిన తల్లిదండ్రులు 

 పాతికేళ్ల క్రితం తల్లిదండ్రులను, భార్యను వదిలి దేశం పట్టిపోయాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియలేదు. ఇన్నాళ్ల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చినా అతనికంటూ గ్రామంలో ఎవరూ మిగల్లేదు. తల్లిదండ్రులు కాలం చేశారు. భార్య మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

వివరాల్లోకి వెళితే...రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన కట్ట మల్లేష్‌ రెండున్నర దశాబ్దాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి తమిళనాడు చేరుకున్నాడు. అక్కడ రోజు కూలీగా జీవితాన్ని నెట్టుకు వస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకుగాని, భార్యకు గాని తెలియదు. చాలా రోజులు అతని కోసం వెతికారు. ఆచూకీ లేకపోవడంతో చనిపోయి ఉంటాడని నిర్థారణకు వచ్చారు. కొన్నాళ్లకు మల్లేష్‌ తల్లిదండ్రులు చనిపోయారు. అతని భార్య కూడా మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

ఇన్నాళ్లకు ఊరు గుర్తుకు రావడంతో నిన్న గ్రామానికి చేరుకున్నాడు. ఊరిలో తనవారంటూ ఎవరూ లేరని తెలియడంతో భోరుమన్నాడు. అసలు ఉన్నాడో లేడో అని అనుకున్న వ్యక్తి హఠాత్తుగా తమ ముందు ప్రత్యక్షం అవ్వడంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. అతని క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఎందుకు ఊరు వదిలి వెళ్లిపోయానో గుర్తులేదని, ఇన్నాళ్లకు రావాలనిపించి వచ్చానని తెలిపాడు.

More Telugu News