Nellore District: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కలకలం.. బ్లేడుతో గొంతు కోసుకుని రోడ్డుపై పరుగులు తీసిన వ్యక్తి

  • బాధితుడిని నెల్లూరు జిల్లాకు చెందిన ప్రశాంత్‌గా గుర్తింపు
  • అప్పుల బాధ, వ్యాపారంలో నష్టాల వల్లే ఆత్మహత్యా యత్నం
  • ప్రస్తుతం నిలకడగానే ఆరోగ్యం

వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధ, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే, గొంతు నుంచి విపరీతంగా రక్తం కారుతుండడంతో బాధకు తాళలేక రోడ్డుపై పరుగులు తీశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తొలుత అతడిపై ఎవరో దుండగులు దాడిచేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే, తానే గొంతు కోసుకున్నానని చెప్పడంతో విస్తుపోయారు.

అయితే, అతడు చెప్పే మాటలు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తొలుత కొందరు వ్యక్తులు తన వద్ద ఉన్న డబ్బులు గుంజుకున్నారని చెప్పాడు. ఆ తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చిందని, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఎక్కువ కావడంతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు చెప్పాడు. బాధితుడిని నెల్లూరుకు చెందిన ప్రశాంత్‌గా గుర్తించిన పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు.

More Telugu News