new delhi: అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ధర్మపురి అరవింద్ మండిపాటు

  • ఎంఐఎం నేతలను ప్రజలు ఎన్నుకోవడం దురదృష్టం
  • గతంలో మీ వాళ్లే నీపై హత్యాయత్నం చేశారు
  • బుద్ధి తెచ్చుకోకపోతే, ఉన్న జీవితం పోగొట్టుకోవాల్సి వస్తుంది

బీజేపీపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నిన్న చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు ఎంఐఎం నేతలను ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. గతంలో అక్బరుద్దీన్ పై జరిగిన దాడి గురించి అరవింద్ ప్రస్తావించారు.

‘మీ వాళ్లే నీపై హత్యాయత్నం చేసి నీ అవయవాలన్నీ డీలా అయ్యేలా చేసిన విషయం గుర్తు లేదా? ఇంకా, మా హిందువులను ఏం చేస్తావు?’ అంటూ విరుచుకుపడ్డారు. మతం పేరిట అన్నదమ్ములిద్దరూ  పబ్బం గడుపుకుంటున్నారని, ఎంఐఎం మత రాజకీయాలకు తెరతీస్తోందని ఓ రేంజ్ లో దుయ్యబట్టారు. ఇప్పటికైనా అక్బరుద్దీన్ బుద్ధి తెచ్చుకోకపోతే, ఉన్న జీవితం కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదే విషయమై ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్, బీజేపీపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సబబు కాదని అన్నారు. కరీంనగర్ లో నడుస్తోంది హిందువుల రాజ్యమని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు ఎంతకైనా దిగజారుతాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు లోపాయకారి ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. 

More Telugu News