Hayathnagar: హయత్‌నగర్‌ యువతి కిడ్నాప్ కేసు.. విజయవాడ వైపు తీసుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు

  • శ్రీధర్‌రెడ్డిగా పరిచయం చేసుకున్న ఆగంతకుడు
  • యువతికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు
  • జిరాక్స్ కోసం తండ్రిని, తనయుడిని కారు దింపి యువతితో పరారు

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. యువతిని విజయవాడ వైపు తీసుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బొంగులూరు రహదారిపై టీ దుకాణం నడుపుతున్న యువతి తండ్రి వద్దకు ఓ వ్యక్తి వచ్చి తన పేరు శ్రీధర్‌రెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. తన తండ్రి న్యాయమూర్తి అని, తల్లి వైద్యురాలని, సోదరుడు పోలీస్ కమిషనర్ అని నమ్మబలికాడు. సచివాలయంలో యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి, ఆమె సోదరుడు, తండ్రి ఆగంతకుడి కారులో వెళ్లారు.

వీరిని నగరంలో కొద్దిసేపు తిప్పిన నిందితుడు అనంతరం ధ్రువ పత్రాల జిరాక్స్ కోసం తండ్రిని. తనయుడిని కారు దింపాడు. వారు అటు వెళ్లగానే యువతితో కారులో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణను కొనసాగిస్తున్నారు. యువతిని విజయవాడ వైపు తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కారు నంబర్‌ను సైతం గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా విజయవాడలో విచారణ నిర్వహిస్తున్నారు.

More Telugu News