Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఐ కొట్టాడంటూ విద్యార్థుల ధర్నా

  • శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఘటన
  • ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న విద్యార్థిని కొట్టిన ఎస్ఐ
  • వారి మంచికే మందలించానని వివరణ

శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని అరసాడ బస్‌ స్టాప్‌ వద్ద, ఓ ఎస్ఐ తమను కొట్టాడంటూ విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు ఉండగా, పాసింజర్ల బస్సులో విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారన్న ఆగ్రహంతో కృష్ణ అనే విద్యార్థిపై స్థానిక ఎస్ఐ కొల్లి రమణ చెయ్యి చేసుకున్నాడన్నది విద్యార్థుల ఆరోపణ. ఎస్ఐ వైఖరిని నిరసిస్తూ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

విషయం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలికి రాగా, విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు ఆయన్ను నిలదీశారు. విద్యార్థులకు స్పెషల్ బస్ ఒక్కటే ఉందని, దీంతో పాసింజర్ బస్సులు ఎక్కుతున్నామని విద్యార్థులు చెప్పగా, ఎస్ఐ వారితో మాట్లాడుతూ, పిల్లలు ఫుట్ బోర్డులపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, ఈ విషయాన్ని పాలకొండ డిపో మేనేజర్ తనకు చెప్పారని అన్నారు. విద్యార్థుల ప్రాణ రక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగానే, మందలించానే తప్ప, కావాలని తానేమీ చేయలేదని వివరణ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు.  

More Telugu News