Chilakaluripet: చిలకలూరి పేటలో వివాహేతర సంబంధం వివాదంలో ఒకరి హత్య!

  • వివాహిత మహిళతో సంబంధం
  • ఇద్దరు యువకుల మధ్య గత కొంతకాలంగా ఘర్షణ
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

పెళ్లయిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి దారుణ హత్యకు దారితీసిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భర్తకు దూరంగా ఉంటున్న ఓ యువతి, చిలకలూరిపేట పక్కనే ఉన్న మురికిపూడి గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తుండగా, ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరంకు చెందిన ఓ యువకుడు ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు.

ఇటీవల మురికిపూడికి ఉపాధి నిమిత్తం వచ్చిన యద్దనపూడి ప్రాంతానికి చెందిన షేక్‌ ఖాదర్‌ బాబావలి, మాంసం దుకాణాన్ని తెరిచాడు. అతనికి కూడా ఆ మహిళ దగ్గరైంది. ఈ విషయం తెలుసుకున్న వేమవరం గ్రామ యువకుడు గత కొన్ని రోజులుగా బాబావలితో గొడవ పడుతున్నాడు.

ఈ నేపథ్యంలో పూటుగా మద్యం తాగి తన దుకాణంలో నిద్రిస్తున్న బాబావలిని ఆ యువకుడు గొడ్డలితో విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. ఆపై ఉదయం 9 గంటలైనా షట్టర్ తెరవని బాబావలిని లేపాలని చూసిన చుట్టుపక్కల వారు, రక్తపు మడుగులో ఉన్న అతన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాఫ్తు చేస్తున్నారు. వేమవరం గ్రామానికి చెందిన యువకుడు ఎవరో గుర్తించి, అరెస్ట్ చేస్తామని తెలిపారు.

More Telugu News