Telangana: ఖమ్మం ఇంజనీరింగ్ కాలేజీలో రెచ్చిపోయిన సీనియర్లు.. జూనియర్ పై దారుణంగా దాడి!

  • ఖమ్మంలోని మదర్ థెరిసా కాలేజీలో ఘటన
  • పొరపాటున సీనియర్ కు మెసేజ్ పంపిన జూనియర్
  • మాకే అసభ్య సందేశం పంపుతావా? అని దాడి

ఖమ్మం జిల్లాలో సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు మృగాళ్లలా మారారు. ఓ జూనియర్ విద్యార్థి తన స్నేహితుడికి పంపాల్సిన సందేశాన్ని సీనియర్ కు పంపడంతో సీనియర్లు రెచ్చిపోయారు. జూనియర్ ను నేలపై పడేసి చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టారు. ఖమ్మంలోని మదర్ థెరిసా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది.

పెద్దపల్లి జిల్లాకు చెందిన శివగణేశ్ మదర్ థెరిసా కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడికి ఫేస్ బుక్ లో పంపాల్సిన ఓ సందేశాన్ని పొరపాటున సీనియర్ విద్యార్థి అఫ్రిదికి పంపాడు. దీంతో రెచ్చిపోయిన సీనియర్లు మాకే అసభ్యకరమైన మేసెజ్ లు పెడతావా? అంటూ అతడిని నిర్మానుష్య భవనంలోకి తీసుకెళ్లి చితకబాదారు.

భోరున ఏడుస్తున్నా వినకుండా కాళ్లతో ఎగిరితన్నారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం ఇరువర్గాల మధ్య రాజీకి ప్రయత్నించింది. అయితే దాడి సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాధిత యువకుడు శివగణేశ్ తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దాడిలో పాలుపంచుకున్న విద్యార్థులపై పోలీసులు ర్యాగింగ్ కేసు నమోదుచేశారు.

More Telugu News