Andhra Pradesh: పశ్చిమగోదావరిలో పొలంలోకి దూసుకెళ్లి పల్టీకొట్టిన ప్రైవేటు స్కూలు బస్సు!

  • పశ్చిమగోదావరిలోని తణుకులో ఘటన
  • ప్రమాద సమయంలో బస్సులో 34 మంది విద్యార్థులు
  • విద్యార్థులను కాపాడిన రైతులు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు పెనుప్రమాదం తప్పింది. జిల్లాలోని తణుకులో 34 మంది విద్యార్థులతో వెళుతున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో విద్యార్థులు హాహాకారాలు చేయగా, అక్కడే పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, బస్సులోంచి విద్యార్థులను బయటకు తీశారు.

కాగా, ఈ ఘటనలో చిన్నారులకు స్వల్ప గాయాలు అయ్యాయని, వారికి ప్రథమ చికిత్స అందించి ఇళ్లకు పంపించివేసినట్లు స్థానిక డాక్టర్లు తెలిపారు. మరోవైపు ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు స్కూలు బస్సుతో పాటు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కాగా, ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? డ్రైవింగ్ సమయంలో ఆయన మద్యం సేవించి వున్నాడా? అనేవి ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News