Hyderabad: సినిమా హాలులో విషాదం.. థియేటర్ కిటికీలో నుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతి

  • అబిడ్స్‌లోని సంతోష్ థియేటర్‌లో ఘటన
  • కిటికీలోంచి జారిపడి తీవ్ర గాయాలపాలైన బాలుడు
  • చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ‘ది లయన్ కింగ్’ సినిమా ప్రదర్శిస్తున్న సంతోష్ థియేటర్‌లో విషాదం చోటుచేసుకుంది. సినిమాకొచ్చిన ఓ దంపతుల మూడేళ్ల కుమారుడు బాల్కనీ కిటికీలోంచి కిందపడి మృతి చెందాడు. ఈ నెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లికి చెందిన పవన్ కుమార్-శిరీష దంపతులు పిల్లలతో కలిసి ‘ది లయన్ కింగ్’ సినిమా చూసేందుకు సంతోష్ థియేటర్‌కు వచ్చారు.

ఇంటర్వెల్ సమయంలో రాత్రి 7:30 గంటలకు శిరీష దంపతులు పిల్లలతో కలిసి చిరుతిళ్లు కొనుగోలు చేసేందుకు హాలులోని బాల్కనీ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడున్న కిటికీ నుంచి వారి మూడేళ్ల కుమారుడు పృథ్వీ ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలుడు ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు పృథ్వీ మృతికి థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News