Chandrababu: మీ ముగ్గురూ నా ఆత్మీయులు... నాని, కింజారపు, గల్లాలతో చంద్రబాబు!

  • సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని ప్రజలకు తెలియాలి
  • కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు పిలుపు

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలూ కార్యకర్తలకు నిత్యమూ అందుబాటులో ఉండి, వారిలో నైతిక స్థైర్యాన్ని నింపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. పార్లమెంట్ సమావేశాలు లేని రోజుల్లో ముగ్గురూ క్యాడర్ కు అందుబాటులో ఉండాలని అన్నారు. పాలనాపరమైన పనుల్లో బిజీ అయిన చంద్రబాబు, పార్టీని నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఓటమిని చవిచూశారన్న వాదనలు వినిపిస్తున్న వేళ, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన ఆయన, నిత్యమూ గుంటూరులోని రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ ఎంపీలుగా విజయం సాధించిన కేశినేని నాని, గల్లా జయదేవ్‌, కింజరపు రామ్మోహన్‌ నాయుడులతో మాట్లాడిన చంద్రబాబు, గెలిచిన మీ ముగ్గురూ తన ఆత్మీయులని, సెలవు సమయాల్లో రాష్ట్ర కార్యాలయానికి రావాలని ఆదేశించారు. పార్టీలోకి కొత్తనీరు తేవాలని సూచించిన ఆయన, ముగ్గురు సభ్యులే ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా వ్యవహరించాలని సూచించినట్టు తెలిసింది.

More Telugu News