Telangana: నేడు బీజేపీ గూటికి వినోద్, వివేక్.. అమిత్ షా సమక్షంలో చేరిక?

  • పెద్దపల్లి నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన వివేక్
  • పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ 
  • నేటి మధ్యాహ్నం 12 గంటలకు చేరిక 

తెలంగాణ నేతలు మరో ఇద్దరు బీజేపీ గూటికి చేరబోతున్నారు. మాజీ మంత్రి వినోద్, ఆయన సోదరుడు వివేక్‌లు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పెద్దపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దిగిన వివేక్ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన వివేక్‌ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో తిరిగి పెద్దపల్లి టికెట్ ఆశించిన వివేక్‌కు కేసీఆర్ మొండిచేయి చూపారు. దీంతో పార్టీకి దూరం జరిగారు.

గత కొంతకాలంగా సోదరులిద్దరూ రాజకీయాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, వీరిద్దరినీ బీజేపీ ఆహ్వానించిందని సమాచారం. కమలదళంలో చేరేందుకు వీరు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ వెళ్లనున్న వివేక్, వినోద్‌, వారి అనుచరులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News